సోషల్ మీడియాలో తల్వార్తో విన్యాసాలు..
ముగ్గురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
✍️ దివిటీ మీడియా – ఖమ్మం
పుట్టినరోజు వేడుకల పేరుతో తల్వార్లు, కత్తుల వంటి ఆయుధాలతో విన్యాసాలు చేస్తూ వాటిని వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేస్తున్న ఘటనపై ముగ్గురిపై ఖమ్మం టూ టౌన్ పోలీసుస్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను పోలీసు సోషల్ మీడియా బృందం పరిశీలించి, సీఐ బాలకృష్ణ ఆదేశాల మేరకు నగరానికి చెందిన షేక్ ఖాదర్, సయ్యద్ సమీర్, ఖమ్మం రూరల్ మండలానికి చెందిన షేక్ సమీర్ అనే ముగ్గురు వ్యక్తులను గుర్తించామని ఎస్సై వెల్లడించారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా బహిరంగప్రదేశాల్లో ఆయుధాలు ప్రదర్శించడం, ప్రమాదకర విన్యాసాలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం ఏమాత్రం సహించబోమని ఎస్సై హెచ్చరించారు.
పుట్టినరోజు వేడుకలు శాంతియుతంగా చేసుకోవాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ల మీద వేడుకలు నిర్వహించడం, ఇలాంటి ఆయుధాలతో విన్యాసాలు చేయడం, వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా కూడా పోలీసుల దృష్టికి వచ్చిన ఘటనలపై విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

