గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం
నిత్యావసరాలు, దుస్తులు, సోలార్ లైట్లు పంపిణీ

✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో శనివారం కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ తరఫున నీలాద్రిపేట, గండి, అశ్వాపురంపాడు, గొత్తికోయ గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులతోపాటు, చీరలు, సోలార్ విద్యుత్ లైట్లు, మహిళా అవసర వస్తువులు పంపిణీ చేశారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సహాయం అందించేందుకు పోలీసుశాఖ తరఫున సహకరిస్తామని తెలిపారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, ప్రజలసంక్షేమం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మద్యపానం, దురలవాట్ల వంటివాటికి దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించి విద్యాభ్యాసాన్ని కొనసాగించే విధంగా వారి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. గ్రామాల్లో శాంతి, సామరస్య వాతావరణం కోసం అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఏడూళ్లబయ్యారం సీఐ వి.వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్.రావు, రాబిన్ హుడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భూసారపు రమేష్, పోలీస్ సిబ్బంది, సభ్యులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

