Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpecial ArticlesSpot NewsTelangana

కలెక్టర్ ఆదేశిస్తే తప్ప కదలరన్నమాట…?

కలెక్టర్ ఆదేశిస్తే తప్ప కదలరన్నమాట…?

‘దివిటీ మీడియా’ ప్రయత్నంతో చిన్న కదలిక

ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు ‘ట్రెంచింగ్…

గతానుభవాలే పునరావృతమవుతాయేమో మరి

✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా

అనేక రకాల పనులతో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ ఆదేశిస్తే తప్ప అధికారులకు తమ విధుల గురించి ఏ మాత్రం గుర్తు రాదన్నమాట… తమ విభాగం పరిధిలో తమకున్న కొద్దిపాటి బాధ్యతలను కూడా జిల్లాకలెక్టర్ గుర్తు చేస్తే తప్ప పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యమో? లేకపోతే ఏమవుతుందిలే అనుకుంటున్న బాధ్యతారాహిత్యమో సంబంధిత అధికారులకే ఎరుక. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనింగ్ శాఖాధికారుల పనితీరు చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్న పరిస్థితి. బూర్గంపాడు మండలం సారపాకలో ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణా వ్యవహారమే దీనికి ఉదాహరణ. సారపాకలో గోదావరి నది ఇసుక అక్రమార్కుల పాలిట స్వర్గధామంగా తయారై, ఏకంగా బ్రిడ్జిలకే ముప్పుగా పరిణమించింది. ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కోసం వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిలు బలహీనపడి కూలిపోయే ప్రమాదం తెచ్చి పెడుతున్న దుస్థితి తలెత్తింది. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా ఈ దుస్థితి దాపురించింది. ఎన్నిసార్లు రెవెన్యూశాఖ అధికారులు చర్యలు తీసుకున్నా, లెక్కచేయకుండా అక్రమ దందా చేస్తున్నవారు ఏకంగా అధికారులపైనే దాడిచేసే దుస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించి ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు మైనింగ్ శాఖ కనీసస్థాయిలో చర్యలు తీసుకున్న సందర్భాలు ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో వారం రోజుల క్రితం ‘దివిటీ మీడియా’ ఈ దందా గురించి బూర్గంపాడు తహసిల్దారు ముజాహిద్ ను వివరణ కోరగా, ఆయన స్పందించి జిల్లాకలెక్టరుకు పరిస్థితులను నివేదించారు. ఈ విషయమై ఈ నెల 25 వ తేదీన “బ్రిడ్జిలు కూల్చేదాకా వదలరేమో…?” శీర్షికతో వార్తాకథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, మైనింగ్ శాఖ అధికారులకు జారీచేసిన ఆదేశాల మేరకు గోదావరి బ్రిడ్జి వద్ద వాహనాలు నదిలోకి దిగేందుకు దారిలేకుండా మంగళవారం ‘ట్రెంచ్(కందకం)’ తవ్వించారు. మైనింగ్ అధికారులు మండల రెవెన్యూ, పోలీసుశాఖల సిబ్బంది సహకారంతో ఈ పని చేయించడం ద్వారా ఇసుక అక్రమ రవాణా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
————————-
ఇసుక అక్రమ రవాణా ఇప్పటికైనా ఆగుతుందా…?
————————-
సారపాకలో రాత్రిపగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణాతో దోచుకుంటున్న అక్రమార్కులకు ఇప్పటికైనా అడ్డుకట్ట పడుతుందో? లేదో? ననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతానుభవాలను బట్టి చూస్తే, ‘ట్రెంచ్’ లను యంత్రాలతో దర్జాగా పూడ్చివేసి మరీ ఈ దందా కొనసాగించిన ఉదంతాలున్నాయి. తాజాగా మైనింగ్, రెవెన్యూశాఖ అధికారులు మరోసారి ట్రెంచ్ తీయించిన నేపథ్యంలో అక్రమార్కులు గతంలోలాగానే పూడ్చివేసి, సవాల్ విసరకుండా అధికారులు ఎలాంటి పకడ్భందీ చర్యలు తీసుకుంటారనేది చూడాల్సిందే. అధికారులు తీసుకున్న చర్యలను లెక్కచేయకుండా తమ అక్రమం కొనసాగించడమంటే, ఏకంగా ప్రభుత్వానికే సవాల్ విసిరినట్లే అవుతుంది. ఇటీవల జరిగిన పరిణామాలు పరిగణనలోకి తీసుకుని జిల్లా కలెక్టర్, ఎస్పీ, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు కనీసం ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు

Divitimedia

పేకాటస్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

Divitimedia

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే

Divitimedia

Leave a Comment