Divitimedia
Crime NewsHyderabadNational NewsPoliticsTelangana

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారీగా కేంద్ర బలగాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు భారీగా కేంద్ర బలగాలు

ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

అక్టోబరు 20న తెలంగాణకు రానున్న కేంద్ర సాయుధ బలగాలు

✍🏽 దివిటీ మీడియా – న్యూఢిల్లీ, హైదరాబాదు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో భద్రతకు కేంద్ర సాయుధ బలగాలను వినియోగించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను పరిశీలించి, విశ్లేషణ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొందరు కలెక్టర్లు, సీపీలు, ఎస్పీల బదిలీలతో ఈసారి తమ నిఘా మరింతగా ఉండబోతోందని చాటిన ఎన్నికల సంఘం,  తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 30న ఒకేరోజు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో భారీగానే  కేంద్ర భద్రతా బలగాలను మోహరించేలా  కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన పటిష్ట భద్రతకు తెలంగాణకు  100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేటాయించగా 20వ తేదీకల్లా ఆ బలగాలు  రాష్ట్రానికి రానున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో  రాష్ట్రంలోని 40వేల మందికి పైగా పోలీసు సిబ్బందికి తోడు అదనంగా తొలి విడతలో 100 కంపెనీల బలగాలు రానున్నాయి. ఈ బలగాలకు తోడు పోలింగ్ జరిగే నాటికింకా   200 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను పంపించే అవసరముందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో పోలీసు బలగాల రక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ  సారి రాష్ట్రమంతా ఒకేసారి పోలింగ్, పలు ఉన్నతస్థానాల్లో అధికారుల బదిలీలు, కేంద్ర బలగాలను భారీగా మోహరించడం వంటి చర్యలతో ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులకు తావులేదని కేంద్ర ఎన్నికలసంఘం సంకేతం ఇస్తుండటంతో రాజకీయపార్టీల్లో తీవ్రమైన  చర్చ సాగుతోంది. రాష్ట్రంలో పోలీసుశాఖపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కేంద్ర సాయుధ బలగాలను భారీగా  మోహరిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికితోడు తీవ్రవాద ప్రభావితప్రాంతాలకు తోడు పలు సమస్యాత్మకప్రాంతాల్లో ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రత అవసరమని ఈసీ అంచనా వేసినట్లు సమాచారం. హోం శాఖ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికందిన  నివేదికతో ఎన్నికల్లో పర్యవేక్షణ మరింతగా పెరిగినట్లు చెప్తున్నారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుస్తోందని ఆరోపణలు చేస్తున్న బీజేపీ, ఈసారి ఎన్నికల్లో కేంద్ర బలగాలను వినియోగించాలని పదేపదే డిమాండ్ చేస్తూ  వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో  కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, కేంద్ర ఎన్నికలసంఘం తీసుకుంటున్న నిర్ణయాలు విశ్లేషిస్తే రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్లో ఎంత హోరాహోరీ పోటీ ఉండబోతోందనేది ఇట్టే అర్థమవుతోందని పరిశీలకుల అభిప్రాయం.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మెడికల్ ఆఫీసర్ కు సీఐటీయూ వినతిపత్రం

Divitimedia

బూర్గంపాడు మహిళా సమాఖ్యకు వరికోత యంత్రం మంజూరు

Divitimedia

పేద విద్యార్థినికి నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

Divitimedia

Leave a Comment