Divitimedia
Bhadradri KothagudemHealthLife StyleSpot NewsTelanganaWomenYouth

పేద రోగికి నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

పేద రోగికి నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

✍️ బూర్గంపాడు – దివిటీ (జూన్ 17)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నలభై ఏళ్ల వలదాసు వెంకటమ్మకు మండలం పరిధిలోని మోరంపల్లిబంజరకు చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ రూ.10 వేలు సాయం అందజేసింది. ఈ మేరకు మంగళవారం ట్రస్ట్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం అందజేశారు. వెంకటమ్మ భర్త సోమయ్య తాపీ పని చేస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటూనే ఇద్దరు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఆ బాధ్యత తీరిపోయిందని సంతోషంగా ఉండగా వెంకటమ్మ అనారోగ్య పరిస్థితి వారిని కుంగదీసింది. ఆమెకు రెండేళ్ల క్రితం గర్భాశయ ఆపరేషన్ చేయించగా, ఆ వెంటనే కడుపులో గడ్డ ఉందంటూ మరొక ఆపరేషన్ చేశారు. ఆ వెంటనే డెంగ్యూ జ్వరంతో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిమైలినేటింగ్ పాలిన్యూరోపతి (CIDP) అనే వైరస్ వ్యాప్తి చెంది శరీరం మొత్తం పూర్తిగా చలనం కోల్పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, ప్రతి నెల ఆమెకు దాదాపు రూ.20వేల ఇంజక్షన్ చేయిస్తున్నారు. గడిచిన 15 నెలల నుంచి చేయించిన ఆ ఇంజక్షన్ ఇంకా మరో 6 నెలలపాటు చేయించాలని వైద్యులు చెప్పారు. ఆమె భర్త సోమయ్య ఆర్ధిక ఇబ్బందులతో తన పరిచయస్తుల సాయంతో వెంకటమ్మకు వైద్యం చేయిస్తుండగా ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగు పడింది. ఇంకా వైద్యం చేయించే స్థోమత లేక ఇబ్బంది పడుతూ దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు.ఈ నేపధ్యంలో నేస్తం ట్రస్ట్ గురించి తెలుసుకున్న సోమయ్య , ఫోన్ ద్వారా సంప్రదించడంతో వెంటనే స్పందించిన ట్రస్ట్ సభ్యులు వారి ఇంటి వద్దకు వెళ్లి వెంకటమ్మ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆమెకు వైద్యం కోసం నేస్తం ట్రస్ట్ నుంచి రూ.10,000 సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామకొండారెడ్డి, వైస్ చైర్మన్ చింతా అంకిరెడ్డి, గౌరవాధ్యక్షుడు సంకా సురేష్, సభ్యులు కైపు రమేష్ రెడ్డి, డి.బాలనారాయణరెడ్డి, ఆవుల శివనాగిరెడ్డి పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Divitimedia

ప్రైవేటు ఏజెన్సీ గుప్పిట్లో ‘ధరణి’ పోర్టల్…

Divitimedia

ఐటీసీ రోటరీక్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

Divitimedia

Leave a Comment