సంతోష్ ట్రోఫీ పోటీలకు ఆతిథ్యమివ్వడం సంతోషకరం
పోటీల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
✍️ న్యూఢిల్లీ – దివిటీ (డిసెంబరు 12)
ఫుట్ బాల్ క్రీడలో ప్రతిష్టాత్మకమైన టోర్నీ సంతోష్ ట్రోఫీకి 57 ఏళ్ల తర్వాత రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలో ఈ నెల 14 ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీ టోర్నీ కోసం రూపొందించిన పోస్టర్ ను ఆయన గురువారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, సురేష్ షేట్కర్, పొరిక బలరాంనాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, రామసహాయం రఘురామిరెడ్డి, న్యూఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్ 14 నుంచి 31 వరకు జరగనున్న ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 37 జట్లు పాల్గొంటున్నాయని ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

